హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): భారత దేశ చరిత్ర, వర్తమాన పరిణామాల పట్ల పాశ్చాత్య దేశాల మీడియా నిరంతరం పక్షపాత ధోరణితోనే వ్యవహరిస్తున్నదని ప్రముఖ పాత్రికేయుడు, రచయిత ఉమేశ్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. సమ్విత్ కేంద్ర సంస్థ ఆదివారం హైదరాబాద్లోని అపర్ణా సైబర్ కమ్యూన్ క్యాంపస్లో చర్చా కార్యక్రమం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ఉమేశ్ ఉపాధ్యాయ తన మొదటి పుస్తకం ‘వెస్టర్న్ మీడియా నెరేటివ్స్ ఆన్ ఇండియా గాంధీ టు మోదీ (భారత్పై పాశ్చాత్య మీడియా కథనాలు గాంధీ నుంచి మోదీ వరకు)ని ప్రతిపాదించారు. చారిత్రక కథనాల నుంచి సమకాలీన దృక్కోణాల వరకు భారత్ను పాశ్చాత్య మీడియా ఎలా చిత్రీకరించిందో వివరించారు.
భారత్ పట్ల పాశ్చాత్య దేశాల అవగాహనను ప్రభావితం చేసిన పలు ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు. అనంతరం రచయితతో ఆహూతుల ప్రశ్నోత్తరాల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ జీ వల్లీశ్వర్, సమ్విత్ కేంద్ర ప్రెసిడెంట్ డాక్టర్ రాహుల్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.