హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార ఘటనలో రాష్ట్ర హోంమంత్రి మనువడి ప్రమేయం ఉందనేది నిరాధార ఆరోపణ అని వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ స్పష్టంచేశారు. సీసీ టీవీ ఫుటేజీలో హోంమంత్రి మనువడు ఎక్కడా కనిపించలేదని చెప్పారు. బాలిక అత్యాచార ఘటనపై శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాలికపై లైంగికదాడి జరిగిందని ఆమె తండ్రి మే 31న ఫిర్యాదు చేశాడని జోయల్ డేవిస్ చెప్పారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదు చేశామన్నారు.సెక్షన్ 354, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.
మే 28న అత్యాచార ఘటన జరిగిందని ఫిర్యాదులో బాలిక తండ్రి పేర్కొన్నట్లు జోయల్ డేవిస్ తెలిపారు. ఈ ఘటన తర్వాత రెండురోజులు బాలిక షాక్లో ఉందని వారు చెప్పారన్నారు. మహిళా పోలీసులతో బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. నిందితుల్లో ఒకరి పేరు మాత్రమే బాలిక చెప్పగలిగిందన్నారు.
దర్యాప్తులో ఐదుగురు నిందితులున్నట్లు గుర్తించామని చెప్పారు. ఐదుగురిలో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నట్లు దర్యాప్తులో భాగంగా గుర్తించామని వెల్లడించారు. భరోసా కేంద్రంలో బాలికకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నామని, భరోసా కేంద్రం అధికారులు బాలిక వాంగ్మూలం నమోదు చేశారని తెలిపారు.
నిందితుల వివరాలను బాలిక చెప్పలేకపోయిందని జోయల్ డేవిస్ తెలిపారు. బాలిక వాంగ్మూలం తర్వాత కేసులో సెక్షన్లను మార్చామని జోయల్ డేవిస్ తెలిపారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, మరో మైనర్ నిందితుడిని ఆ కుటుంబం కస్టడీలోనే ఉంచామన్నారు. మరో ముగ్గురిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని జోయల్ డేవిస్ తెలిపారు. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి విచారణ చేస్తున్నారని, నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పక్కా సాంకేతిక ఆధారాలున్నాయని జోయల్ డేవిస్ తెలిపారు. మరోసారి బాలికను విచారించి ఆధారాలు సేకరిస్తామన్నారు.
ఈ ఘటనకు సంబంధించి మొదటినుంచి ఆధారాలు సేకరించినట్లు జోయల్ డేవిస్ చెప్పారు. ఎమ్మెల్యే కొడుకుకు సంబంధించిన ఆధారాలు కూడా లభించలేదని స్పష్టంచేశారు. ఆధారాలు లేకుండా వ్యక్తులపై విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రమేయంలేనివారి పేర్లు చెబితే వారి భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఈ ఘటనలో ప్రముఖ వ్యక్తి కొడుకు ప్రమేయం ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఆ ప్రముఖ వ్యక్తి కొడుకు జువైనల్ కాబట్టి పేరు వెల్లడించడం లేదని జోయల్ డేవిస్ తెలిపారు.