Bengaluru | హైదరాబాద్, అక్టోబర్ 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): నిన్నటి నాలుగేండ్ల బీజేపీ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కర్ణాటక కష్టాలకు కేంద్రంగా మారిపోయింది. ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలుచుకొనే బెంగళూరు పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. గార్డెన్ సిటీగా మొన్నటివరకూ ముద్దుగా పిలుచుకొన్న బెంగళూరు నగరాన్ని నేడు సమస్యలకు కేరాఫ్గా పిలుస్తున్నారు. రోడ్డెక్కితే ట్రాఫిక్ కష్టాలు, కాలుష్యంతో ఊపిరిపోయే దుస్థితి, విద్యుత్తు కోతలతో సామాన్యుల వెతలు, తాగునీటికి తంటాలు, భద్రత కరువు, ఆకాశాన్నంటుతున్న లివింగ్ కాస్ట్ వెరసి బెంగళూరులో ఇక ఉండబోయేది లేదని ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్యులు చెబుతున్నారు. నరకానికి చిరునామాగా బెంగళూరు మారిపోయిందంటూ ప్రముఖులు సైతం తమ అసహనాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
బెంగళూరులో గత కొన్నిరోజులుగా ట్రాఫిక్ కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతున్నది. తాజాగా జరిగిన మూడు ఘటనలు బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ట్రాఫిక్లో చిక్కుకున్న ఓ మహిళ కూరగాయలను ఒలుచుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. ట్రాఫిక్లో వంట కూడా చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. కారులో ప్రయాణిస్తూ ఔటర్ రింగ్ రోడ్డుపై గంటల తరబడి ట్రాఫిక్ జావ్ులో చిక్కుకున్న కొందరు పిజ్జాకు ఆర్డర్ ఇవ్వడం, దానిని ఆన్టైవ్ులోనే డెలివరీ బాయ్ ట్రాఫిక్లో ఇరుక్కుని ఉన్న కారు వద్దకే వచ్చి డెలివరీ చేసిన వీడియో వైరల్గా మారింది. ఇక, బెంగళూరు ట్రాఫిక్లో చిక్కుకొన్న ఓ వ్యక్తికి అతనేదో షాపింగ్కు వెళ్లినట్టు ‘మీ షాపింగ్ అనుభవం ఎలా ఉంది?’ అంటూ గూగుల్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఆయన గంటల తరబడి ఓ షాపింగ్మాల్ పక్కన ట్రాఫిక్లో చిక్కుకుపోవడమే అందుకు కారణంగా తెలుస్తున్నది.
గత బీజేపీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్లు అధ్వానంగా ఉన్నట్టు మండిపడుతున్నారు. చెట్లు లేకపోవడంతో కాలుష్యం కూడా అంతకంతకూ పెరిగిపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, గంటల తరబడి నగరంలో కొనసాగుతున్న విద్యుత్తు కోతలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ వచ్చాక విద్యుత్తు కష్టాలు మరింతగా పెరిగాయని మండిపడుతున్నారు. అయితే, మరమ్మతుల పనుల కారణంగానే విద్యుత్తు కోతలు విధిస్తున్నట్టు ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇక, నగరంలోని స్మార్ట్సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వేలల్లో అద్దెలు, గృహ పన్నులను చెల్లిస్తున్నప్పటికీ కనీస అవసరాలను కూడా కార్పొరేషన్ అధికారులు తీర్చడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన నాలుగేండ్లలో క్రైమ్ రేటు కూడా పెరిగిందని, సీసీటీవీ కెమెరాలు అలంకారప్రాయంగానే ఉన్నాయని, మెజారిటీ కెమెరాలు పనిచేయట్లేదని పలువురు చెబుతున్నారు.
దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ కమెడియన్ ట్రెవోర్ నోహ్ ఇటీవల బెంగళూరులో ఓ షోలో పాల్గొనాల్సి ఉన్నది. అయితే, నగరంలోని ట్రాఫిక్, కనీస సౌకర్యాలకు దూరంగా టెంట్తో ఏర్పాటుచేసిన వేదిక, స్టేజీ వెనుక కుక్కలు హల్చల్ చేయడం వెరసి ఆయన తన షోను క్యాన్సల్ చేసుకొన్నారు. ఇలాంటి వసతులలేమి ఉన్న ప్రాంతంలో షోను ఎలా చేయగలమని సోషల్మీడియాలో ప్రశ్నించారు. దీనిపై బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా స్పందించారు. బెంగళూరులోని సమస్యలు నోహ్ కామెడీ షోలకు మంచి కంటెంట్గా మారొచ్చని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొనకపోతే, ప్రముఖులు ఎవరూ నగరానికి రాబోరని హెచ్చరించారు. బెంగళూరులో ఆర్థిక మాంద్యం పరిస్థితులు తలెత్తితే గానీ, ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కాబోవేమో అంటూ అధికారుల వైఖరిని నిరసిస్తూ ఓ సీఈవో ట్వీట్ చేశారు.
సమస్యల బెంగళూరుతో విసిగివేసారిన వారికి హైదరాబాద్ ప్రత్యామ్నాయంగా మారుతున్నది. విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువమంది భాగ్యనగరాన్ని తమ గమ్యస్థానంగా మార్చుకొంటున్నారు. విశాలమైన రోడ్లు, వంతెనలు, స్కైవేలు, ఫుట్పాత్లతో నగరంలో ప్రయాణం సాఫీగా సాగుతున్నదని, ట్రాఫిక్ కష్టాలు లేవంటూ ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ 2022 నివేదిక వెల్లడించింది. నగరంలో 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా, పచ్చని చెట్లతో పరిశుభ్రమైన వాతావరణం, ఇంటింటికీ తాగునీటి సరఫరా, అందుబాటు ధరల్లో అద్దెలు, 4,40,299 సీసీటీవీ కెమెరాలతో పటిష్టమైన భద్రత ఉండటంతో ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్యులు తమ నివాసానికి హైదరాబాద్ను ప్రథమ ఆప్షన్గా ఎన్నుకొంటున్నారు. కాగా, హైదరాబాద్లో సదుపాయాలు, అభివృద్ధిపై నీతిఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ఈడీ సుచితా దత్త, ప్రముఖ నటుడు రజినీకాంత్, బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్, ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ అమిత్ జింగ్రాన్ తదితరులు ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపించడం తెలిసిందే.