కామారెడ్డి : స్వరాష్ట్రంలో గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దీంతో ప్రతి కుటుంబంలో సంతోషం వెళ్లి విరుస్తుందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Mla Goverdhan) అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సుపరిపాలన సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్ణాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్(CM KCR) నూతనంగా కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడం వల్ల పాలన ప్రజల వద్దకు చేరువైందని తెలిపారు. దీంతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్రంలో సంక్షేమ(Welfare) పథకమందని ఇల్లు లేదని, లబ్ధిదారుడు లేని కుటుంబం లేదని పేర్కొన్నారు.
జిల్లా ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసి రాష్ట్రంలో అన్ని రంగాల్లో జిల్లా మొదటి స్థానంలో నిలిచే విధంగా చూడాలని కోరారు. ప్రభుత్వం అన్ని కులాలకు, మతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభ , కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. జిల్లాలో కార్పొరేట్ పాఠశాలల తరహాలో బీబీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల సముదాయం, భవానిపేట గ్రామపంచాయతీ భవనం నిర్మించారని తెలిపారు. నూతన రాష్ట్రంలో 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.