సికింద్రాబాద్, జూలై 1: విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్న యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్కు విచ్చేయనున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్టులో ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం అక్కడి నుంచి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా 10 వేల మందితో టీఆర్ఎస్ భారీ బైక్ ర్యాలీ, 12.30 గంటలకు జలవిహార్లో బహిరంగ సభను నిర్వహించనున్నది. ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిచనున్నారు. ర్యాలీ, సభకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేశారు. వాటిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యవేక్షించారు. యశ్వంత్ సిన్హాకు శనివారం అపూర్వ స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి తెలిపారు. సిన్హాకు వెయ్యి బైకులతో స్వాగతం పలుకుతామని చెప్పారు. కంటోన్మెంట్, మేడ్చల్ నియోజకవర్గాల నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు భారీగా టీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని స్వాగతం పలుకుతాయని పేర్కొన్నారు. శనివారం ఉదయం కంటోన్మెంట్లో ఎమ్మెల్యే సాయన్న నేతృత్వంలో సుమారు వెయ్యి బైక్లతో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకొంటామని చెప్పారు.