హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): పోడు భూముల పంపిణీపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అటవీ, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిశీలన కొలిక్కి వస్తున్నది. ఇప్పటికే 17 జిల్లాల్లో ఫిర్యాదుల పరిశీలన పూర్తయింది. 28 జిల్లాలు, 295 మండలాలు, 2,845 గ్రామ పంచాయతీల పరిధిలో ఫారెస్ట్ రైట్ కమిటీలు రెండు మూడు నెలల నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నాయి. 12,49,296 ఎకరాల భూమికి సంబంధించి 4,14,353 ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి.
గిరిజనుల నుంచి 62 శాతం, గిరిజనేతరుల నుంచి 38 శాతం ఫిర్యాదులు వచ్చాయి. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నది. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు హైదరాబాద్ నుంచి నిత్యం మానిటరింగ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అటవీ, రెవెన్యూశాఖలు సమన్వయంతో పనిచేయాలని, భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఆదేశించారు. జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈ సర్వే కోసం డిసెంబర్ 13, 2005కు ముం దు అటవీ (పోడు) భూములు ఆధీనంలో ఉన్నవారిని ప్రామాణికంగా తీసుకొంటున్నారు. అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల విషయంలో ఈ కటాఫ్ డేట్ను అనుసరిస్తూనే కనీసం 75 ఏండ్లు (మూడు తరాలు) ఏజెన్సీ ఏరియాల్లో జీవనం సాగిస్తున్నట్టు ఆధారాలు చూపాలని నిర్దేశించారు.
శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ ఉదాత్త నిర్ణయం తీసుకొన్నారు. అటవీ, గిరిజన, రెవెన్యూ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సర్వే దాదాపు పూర్తయింది. దీనిని సీఎం ఎప్పుటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఒక్కసారి పోడు సమస్య పరిష్కారమైతే భవిష్యత్తుతో ఆ సమస్య మూలాలు కూడా ఉండరాదనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరకుండా నిబంధనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సర్వే బృందాలు పనిచేస్తున్నాయి.
– సత్యవతి రాథోడ్, స్త్రీ,శిశు,గిరిజన సంక్షేమశాఖ మంత్రి
ఎఫ్ఆర్సీ ఏర్పాటైన ఆవాసాలు 4,946
పరిశీలన పూర్తయిన ఫిర్యాదులు 2,77,725 (67 శాతం)
పరిష్కరించాల్సిన ఫిర్యాదులు 1,36,628 (33 శాతం)
ఫిర్యాదుల పరిశీలన పూర్తయిన జిల్లాలు
హన్మకొండ, జగిత్యాల, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న-సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి.
క్షేత్ర పరిశీలనకు టైమ్లైన్
గ్రామసభలు: ఈ నెల 14 నుంచి 19 వరకు
ఎస్డీఎల్సీ: ఈ నెల 21 నుంచి 25 వరకు
డీఎల్సీ: ఈ నెల 26 నుంచి 30 వరకు
ఈ నెల 30 వరకు క్షేత్ర పరిశీలన పూర్తిచేయాల్సిన జిల్లాలు
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్-భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మహబూబాబాద్, నల్లగొండ, నిర్మల్, వరంగల్, యాదాద్రి-భువనగిరి.
ఈ 11 జిల్లాల్లో క్షేత్ర పరిశీలనకు టైమ్లైన్
గ్రామసభలు: డిసెంబర్ 1 నుంచి 7 వరకు
ఎస్డీఎల్సీ: డిసెంబర్ 8 నుంచి 12 వరకు
డీఎల్సీ: డిసెంబర్ 14 నుంచి 19 వరకు