సిరిసిల్ల రూరల్, జూన్ 25: సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేండ్లుగా ఏ బాధా లేకుండా బతికిన నేత కుటుంబాలు.. కాంగ్రెస్ సర్కారు ఆర్నెళ్ల పాలనలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయి ఉపాధి కరువై, బతుకు బరువై చితికిపోతున్నాయి. నాలుగు రోజుల కిందే సిరిసిల్లలోని రాజీవ్నగర్కు చెందిన కుడిక్యాల నాగారాజు (47) ఉపాధి లేక యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే.. తాజాగా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ (టెక్స్టైల్ పార్క్)కి చెందిన వైపని కార్మికుడు ముదిగొండ నరేశ్ (35) ఇంట్లోనే ఉరేసుకున్నాడు.
ఇందిరమ్మ కాలనీకి చెందిన ముదిగొండ శాంతవ్వ, ఈశ్వరయ్య దంపతుల కొడుకు నరేశ్ (35) వస్త్ర పరిశ్రమలో వైపని కార్మికుడి (బీములు నింపడం, పోగులు వేయడం)గా పని చేస్తున్నాడు. నరేశ్కు 2018లో స్వాతితో వివాహమైంది. మొదటి సంతానంలో కొడుకు జన్మించినా.. ప్రసవ సమయంలో ఉమ్మనీరు మింగడంతో మృతి చెందాడు. స్వాతి రెండోసారి గర్భం దాల్చినా కొన్ని కారణాలతో కడుపులోనే శిశువు మృతి చెందింది. ఇక తల్లి శాంతవ్వ పక్షవాతంతో మంచం పట్టగా.. తండ్రి ఈశ్వరయ్య వృద్ధాప్యంతో అచేతన స్థితిలో ఉన్నాడు.
ఇన్నేండ్లూ వీరి అలనా పాలన నరేశ్-స్వాతి చూసుకుంటున్నారు. స్వాతి బీడీలు చుడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉన్నది. ఆరు నెలలుగా నరేశ్కు పనిలేక ఖాళీగా ఉన్నాడు. కుటుంబం గడవని పరిస్థితి నెలకొంది. సభ్యుల వైద్యానికి తెచ్చిన అప్పులు పేరుకుపోవడంతో అవస్థలు పడుతున్నాడు. పని లేక.. అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపం చెంది సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే ఉరేసుకున్నాడు. ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.