Weather Report | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపం చూపుతుండడంతో జనం అల్లాడుతున్నారు. దాంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక తెలంగాణలో బుధవారం పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా జయశంకర్ భూపాపల్లి జిల్లా మహదేవ్పూర్, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 44.5 గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
తలమడుగు (ఆదిలాబాద్) 44.3, కీతవారిగూడెం (సూర్యాపేట) 44.2, వెల్గటూరు (జగిత్యాల) 44.2, కొల్లాపూర్ (నాగర్కర్నూల్) 44, తాడ్వాయి (ములుగు) 44, గరిమెల్లపాడు (భద్రాద్రి కొత్తగూడెం), 44, కొమ్మెర (మంచిర్యాల) 43.9, చప్రాలా (ఆదిలాబాద్) 43.9, భిక్కనూర్ (కామారెడ్డి) 43.8, పజ్జూర్ (నల్లగొండ) 43.8, ధర్మసాగర్ (హన్మకొండ) 43.8, జైనత్ (ఆదిలాబాద్) 43.7, పాత కొత్తగూడెం (భద్రాద్రి కొత్తగూడెం) 43.7, సుజాతనగర్ (భద్రాద్రి కొత్తగూడెం) 43.7, కొండాపూర్ (మంచిర్యాల) 43.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక హైదరాబాద్ జంటనగరాల పరిధిలోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఓ వైపు పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఎప్పుడు ఎండ కాస్తుందని, ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం కురుస్తుందని వాతావరణశాఖ పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.