హనుమకొండ : ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని ప్రముఖ హీరో సుమన్ వాహనదారులకు పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణ నష్టాన్ని నియంత్రించడంతో పాటు రోడ్డు ప్రమాదాల కట్టడి చేసేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి పిలుపునిచ్చారు.
ఈ మేరకు కాజీపేట్ డివిజనల్ పోలీసుల అధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని కాజీపేట పోలీస్ స్టేషన్ అవరణలో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో సుమన్ మీడియా ప్రతినిధులతో పాటు, పోలీస్ సిబ్బందికి హెల్మెట్లను అందజేసారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తనవంతు బాధ్యత గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలను అతిక్రమించి వాహనాలను నడపడం ఒక హీరోయిజంగా భావించ వద్దన్నారు.
అలసత్వం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వాహనదారుడు క్రమశిక్షణతో వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు.
అంతకు ముందు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యుడు ప్రభుత్వ విప్, వర్ధన్నపేట శాసనసభ్యుడు అరూరి రమేష్, వరంగల్ మున్సిపల్ మేయర్ గుండు సుధారాణి ఈ కార్యక్రమానికి హజరై పాత్రికేయులకు హెల్మెట్ల అందజేసారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. వాహనదారులు జరిమానాలు పడ్డాయని బాధపడకుండా ఉండాలంటే ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ తప్పని సరిగా ధరించి వాహనం నడపాలని ప్రభుత్వ విప్ సూచించారు.
అనంతరం హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం కాజీపేట్ డివిజనల్ పోలీసులు నిర్వహించిన బైక్ ర్యాలీని సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ బాలస్వామి, కాజీపేట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లు మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.