ముక్రా(కే)కు కేంద్రం ప్రశంసలు
తెలంగాణలో పారిశుద్ధ్యం భేష్
ఇతర రాష్ర్టాలకు ఆదర్శనీయం
సీఎం కేసీఆర్వి గొప్ప కార్యక్రమాలు
జాతీయ సదస్సులో అభినందనలు
ఇచ్చోడ/ హైదరాబాద్, మార్చి 26 : గ్రామపంచాయతీల్లో చెత్తతో ఆదాయం సృష్టించటం అద్భుతమని, ఇలా ఆదాయాన్ని సమకూర్చుకొంటున్న తొలి గ్రామం.. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలానికి చెందిన ముక్రా(కే) అని కేంద్రం కొనియాడింది. ‘బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఓడీఎఫ్ ప్లస్’ అంశంపై శనివారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సుకు అన్ని రాష్ర్టాల ప్రతినిధులతోపాటు ఓడీఎఫ్ ప్లస్గా మారిన ఆదిలాబాద్ జిల్లా ముక్రా(కే) గ్రామపంచాయతీ సర్పంచ్ మీనాక్షి గాడ్గేను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణలో అద్భుత ప్రగతి సాధించి ఓడీఎఫ్ (ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ) ప్లస్ రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణను కేంద్రం మరోసారి అభినందించింది. తెలంగాణ తరహాలో ఓడీఎఫ్ ప్లస్గా మారాలని కేంద్ర జల్శక్తి శాఖ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ (డీడబ్ల్యూఎస్) కార్యదర్శి వినీ మహాజన్ అన్ని రాష్ర్టాలకు సూచించారు. అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోకా మాట్లాడుతూ.. పల్లెప్రగతి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ముక్రా(కే) సర్పంచ్ మీనాక్షిని అభినందించిన కేంద్ర అధికారులు.. ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
పల్లె ప్రగతితోనే సాధ్యమైంది
తెలంగాణలోని 12,769 గ్రామాల్లో 12,753 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్గా గుర్తింపుపొందాయని, ఇదంతా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’తోనే సాధ్యమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ శరత్ తెలిపారు. సదస్సులో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి కార్యదర్శిని నియమించడంతోపాటు ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీని అందించి ప్రతి నెలా నిధులను విడుదల చేయడంతో పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని వివరించారు. డంపింగ్ షెడ్లలో తడి, పొడి చెత్తను వేరు చేయడం ద్వారా ఒక్కో గ్రామం రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నాయని వెల్లడించారు.
కరోనా కేసుల్లేని గ్రామం: సర్పంచ్ మీనాక్షి
ముక్రా(కే) గ్రామంలో కనీసం ఒక్కరు కూడా కరోనా బారిన పడలేదని సర్పంచ్ మీనాక్షి గాడ్గే స్పష్టం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి, అంటు వ్యాధులను నిరోధించేందుకు తాము చేపట్టిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించిన సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ముక్రా(కే) గ్రామం ఓడీఎఫ్ ప్లస్గా మారేందుకు దోహదం చేసిన అంశాలను ఆమె సదస్సులో వివరించారు.