హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీ(BJP)కి వ్యతిరేకంగా బీఆర్ఎస్(BRS)తో సీపీఎం (CPM)కలిసి పనిచేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. అఖిలపక్షం పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు చేపట్టే సమావేశాలు, ఆందోళనల్లో తాము పాల్గొన బోమని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటూ కొన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయని, తాము అలా కోరుకోవడం లేదని పేర్కొన్నారు.
మంగళవారం నుంచి ప్రారంభమైన సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ(State Committee) సమావేశాల సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని ఎంబీ భవన్లో పార్టీ పొలిట్బ్యూరో, రాష్ట్ర నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా బీజేపీని ఓడించే స్థాయికి కాంగ్రెస్ చేరితే ఇక్కడ కూడా ఆ పార్టీతో సర్దుబాటు చేసుకోవచ్చని, కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్తో సీట్ల గురించి ఇంకా చర్చ జరగలేదన్నారు. తమ బలానికి తగ్గట్టుగా సీట్లు కోరతామని ప్రకటించారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్తో రాజకీయంగా స్నేహంగా ఉంటామని తెలిపారు.
బీజేపీ విధానాలను సమర్ధించడం అంత సులువు కాదని, అందుకే కేసీఆర్(KCR)ను సమర్థిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడాలని చూస్తున్నదని చెప్పారు. ఇతర పార్టీల వారిని ప్రలోభాలకు గురిచేసి, బెదిరించి చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నదన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్( Kejriwal), మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులు, తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత(Mlc Kavita)ను ఈడీ విచారించడం అందులో భాగమేనని చెప్పారు.