Boats overturn : ప్రాణాలకు రక్షణ, మెరుగైన జీవన పరిస్థితుల కోసం శరణార్థులు (Refugees) ప్రమాదకర స్థితిలో సముద్ర ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల శరణార్థులతో వెళ్లిన రెండు పడవలు మయన్మార్ తీరం (Maynmar Coast) లో బోల్తాపడి ఉండవచ్చని ఐక్యరాజ్యసమితి (UNO) అనుబంధ సంస్థలు తెలిపాయి. ఆ పడవల్లో మొత్తం 500 మంది ఉన్నారని, వారంతా మరణించి ఉండవచ్చని పేర్కొన్నాయి.
ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ రెండు పడవలు జూన్ చివరలో మయన్మార్లోని రఖైన్ రాష్ట్రం నుంచి బయలుదేరాయని, వాటిలో ఎక్కువ మంది రోహింగ్యా జాతికి చెందిన ప్రయాణికులేనని అంతర్జాతీయ వలస సంస్థ, ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. బంగ్లాదేశ్లోని శరణార్థి శిబిరాల నుంచి వచ్చిన కొందరూ ఆ పడవల్లో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనల్లో 500 మందికిపైగా మృతి చెందినట్టు భావిస్తున్నామని పేర్కొన్నాయి.
అయితే ఈ ఘటనలు, మృతుల సంఖ్యపై ఇంకా అధికారికంగా ధ్రువీకరణ రాలేదని, అయినా భారీగా ప్రాణనష్టం జరిగి ఉండవచ్చన్న అంశంపై యూఎన్హెచ్సీఆర్, ఐఓఎమ్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయని సంయుక్త ప్రకటనలో ఆ సంస్థలు పేర్కొన్నాయి. 2025లో అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలో దాదాపు 900 మంది రోహింగ్యా శరణార్థులు అదృశ్యమయ్యారు లేదా ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. దాంతో ఈ సముద్ర మార్గం ప్రపంచంలోనే వలసదారులు, శరణార్థులకు అత్యంత ప్రమాదకర మార్గంగా మారిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ఐక్యరాజ్యసమితి సంస్థల సమాచారం ప్రకారం.. తొలి పడవ బయలుదేరిన కొద్దిసేపటికే దానితో సంబంధం తెగిపోయింది. అందులో దాదాపు 250 మంది ఉన్నారు. 280 మందితో ప్రయాణించిన రెండో పడవ జూలై 8న మయన్మార్లోని ఇరావడీ తీరంలో బోల్తాపడి ఉండొచ్చని భావిస్తున్నారు. సాధారణ నౌకాయాన కాలం ముగిసిన తర్వాత ఈ ప్రయాణాలు జరిగాయని, ఆ సమయంలో సముద్ర పరిస్థితులు సాధారణంగా మరింత ప్రమాదకరంగా ఉంటాయని ప్రకటనలో ఐరాస తెలిపింది.
2026లో కూడా రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులు కలిపి దాదాపు 300 మంది అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలో అదృశ్యమైనట్టు సమాచారం అందిందని యూఎన్హెచ్సీఆర్, ఐఓఎమ్ తెలిపాయి.