హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా దేశం నలువైపుల నుంచి వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిమ్స్ను కార్పొరేట్కు దీటుగా మరింత బలోపేతం చేస్తామని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంచాలకులు డాక్టర్ రాహుల్ దేవరాజ్ అన్నారు. నిమ్స్ కొత్త డైరెక్టర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ.. నిమ్స్లో పేద రోగులకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందించాలన్నదే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమని, ఆ దిశగానే నిమ్స్ను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నిమ్స్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ఎమర్జెన్సీ విభాగమని, ఎమర్జెన్సీలో బెడ్స్ దొరకవు అనే అపవాదు తొలగించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఎమర్జెన్సీలో పడకల కొరత ఏర్పడకుండా అన్ని విభాగాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడించారు. ఓపి, బిల్లింగ్ కౌంటర్ల సంఖ్యను రెట్టింపు చేశామని, సమాచారం, ఇతర సహయ, సహకారాలు అందించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. వారం పదిరోజుల్లోనే 100టన్నుల చెత్తను శుభ్రం చేయించినట్టు తెలిపారు.