Minister KTR | తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రైవేట్ రంగంలో రాకెట్ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన హైదరాబాద్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ అభినందన సభలో కేటీఆర్ ఈ మేరకు ప్రకటించారు. హైదరాబాద్ కేంద్రంగా తమ కంపెనీ అంతరిక్షంలో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా రాకెట్ను ప్రయోగించి చరిత్ర సృష్టించిందని భవిష్యత్తులోనూలో తెలంగాణ కేంద్రంగానే తమ కంపెనీ మరింత ముందుకు పోయే ప్రణాళికలు ఉన్నాయని స్కై రూట్ తెలిపింది. తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇందకు సహకరించాలని మంత్రి కేటీఆర్ను స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ కోరింది. ముందునుంచి స్కై రూట్లాంటి కంపెనీలకు మద్దతివ్వడం తమకు గర్వకారణం అన్న కేటీఆర్, ఆ కంపెనీ భవిష్యత్ ప్రణాళికలక తెలంగాణ ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
స్కైరూట్ ప్రతిపాదిస్తున్న సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామి ఇచ్చారు. స్కై రూట్ సక్సెస్తో హైదరాబాద్, టీ హబ్ పేరు మరోసారి మారుమోగిందన్న కేటీఆర్, ఇందుకు ఆ కంపెనీకి అభినందనలు తెలిపారు. దేశ అంతరిక్షరంగంలో చరిత్ర సృష్టించిన స్కై రూట్కు హైదరాబాద్ వేదికవడం గర్వంగా ఉందన్నారు కేటీఆర్. దేశ అంతరిక్ష రంగానికి ఇది చారిత్రాత్మక సందర్భం అన్నారు. రాకెట్ లాంటి సంక్లిష్టమైన ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించడం సులభం కాదని, తొలి ప్రయత్నంలో అంతరిక్షంలోకి రాకెట్ను పంపగలిగే సత్తా సంపాదించడం మాములు విషయం కాదన్నారు. స్కై రూట్ కంపెనీ టీం వర్క్తోనే ఇది సాధ్యమైందన్నారు. రాకెట్ తయారీ అంటేనే ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తి చూపించరని, అయితే రాబోయే రోజుల్లో ఈ ఆలోచన మారుతుందన్నారు.
స్పేస్ టెక్ క్యాపిటల్గా హైదరాబాద్ మారుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మరో స్టార్టప్ ధృవ కూడా త్వరలోనే ఉపగ్రహ ప్రయోగం చేపట్టబోతుందని, త్వరలో మరో సక్సెస్ స్టోరీని దేశం చూడబోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన స్పేస్ టెక్ పాలసీతో ఇక్కడే రాకెట్లు తయారుచేయవచ్చని, ఇక్కడి నుంచే ప్రయోగించవచ్చని కేటీఆర్ తెలిపారు. ఒక అద్భుతమైన ఆలోచనకు ఊతం ఇచ్చేలా టీ హబ్, టీ వర్క్స్ ఏర్పాటుచేయడం గొప్ప విషయం అన్న స్కై రూట్ ఏరో స్పేస్ కంపెనీ యాజమాన్యం, తమ ప్రస్థానంలో ఈ రెండింటి పాత్ర మరువలేనిదని తెలిపింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్కు స్కై రూట్ కంపెనీ ధన్యవాదాలు చెప్పింది. 200 మంది స్కై రూట్ సిబ్బంది కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉందని ఆ కంపెనీ ప్రతినిధి పవన్ చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా భవిష్యత్తులోనూ తమ కంపెనీ విస్తరిస్తుందన్న పవన్, అంతరిక్ష రంగానికి సంబంధించిన విభిన్నమైన రంగాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన వ్యక్తులు, సపోర్ట్ ఈకో సిస్టం హైదరాబాద్లో ఉండడంతోనే ఈ విజయం సాధ్యమైందని గుర్తుచేశారు.