కరీంనగర్ కలెక్టరేట్, మే 12: వయోవృద్ధులకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో డే కేర్ సెంటర్లు, హైదరాబాద్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. వృద్ధులను రాష్ట్ర సంపదగా భావించి సముచిత గౌరవమివ్వాలని సూచించారు. కరీంనగర్లోని జడ్పీ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేతకానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. ఈ దిశగా వారి కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారని చెప్పారు. డేకేర్ సెంటర్లలో జిమ్, పుస్తకాలు, యోగా, తదితర శారీరక, మానసిక ఆహ్లాదాన్నిచ్చేలా వసతులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మంత్రి గంగుల మాట్లాడుతూ వృద్ధుల్లో ఒంటరితనాన్ని నివారించేందుకు డే కేర్ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అంతకుముందు సీనియర్ సిటిజన్, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన రెస్క్యూ వాహనాన్ని, ఇదే భవనంలో ఏర్పాటు చేసిన వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్రావు తదితరులు పాల్గొన్నారు.