కంది, మార్చి 27: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సీపీఆర్ శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హార్ట్స్ట్రోక్, సడెన్ కార్డియాక్ అరెస్ట్తో సంభవిస్తున్న ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు.
సడెన్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్స్ట్రోక్ రెండు ఒకటే అని చాలా మంది అనుకుంటారని, కానీ.. వైద్య నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఇవి రెండు వేర్వేరని మంత్రి వివరించారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటే అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు మనిషి సైకలాజికల్ షాక్కు గురవుతాడని, ఈ సమయంలో హృదయ స్పందనలో తేడా వచ్చి మనిషికి శ్వాస ఆగిపోతుందని తెలిపారు.
ఆ సమయంలో గుండె కొట్టుకునేలా ఛాతీ మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించడంతో గుండె, ఊపిరితిత్తులు తిరిగి పనిచేస్తాయని, దీన్నే సీపీఆర్ అంటారని మంత్రి వివరించారు. ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్స్ (ఏఈడీ) వైద్య పరికరం ద్వారా ఛాతీ నుంచి గుండెకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పనిచేస్తుందని చెప్పారు. రూ.15 కోట్లతో 1262 ఏఈడీ మిషన్లను ప్రభుత్వం కొనుగోలు చేసి అన్ని సీహెచ్సీలు, పీహెచ్సీలు, బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేయబోతున్నట్టు హరీశ్రావు తెలిపారు. పరిశ్రమలు, అపార్ట్మెంట్లు, మాల్స్, జనాలు ఎక్కువగా ఉండే నిర్మాణాల్లో ఏఈడీ మిషన్లు తప్పనిసరి చేసేలా జీవో తీసుకొస్తామని చెప్పారు.