హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా తీసుకొస్తున్న విద్యుత్తు చట్ట సవరణ బిల్లును అడ్డుకొంటామని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్తు ఉద్యోగులు జరుపుతున్న పోరాటంలో రాజకీయాలకు అతీతంగా భాగస్వాములం అవుతామని ప్రకటించారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు ఈ ప్రకటన చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరెడ్డి మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగాన్ని అత్యంత పటిష్ఠంగా తీర్చిదిద్దారని, అన్ని వర్గాలకూ నిరంతరాయంగా 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును అందజేస్తున్నారని తెలిపారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.36 వేల కోట్లను ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనను సీఎం కేసీఆర్ నిర్దంద్వంగా తోసిపుచ్చారని, విద్యుత్తు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని గుర్తుచేశారు.
ఈ బిల్లుతో విద్యుత్తు వ్యస్థలన్నీ కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతాయని, విద్యుత్తు చార్జీల పెరుగుదలతో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్ ఎన్ శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎం కోదండరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డీజీ నరసింహారావు, న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత జేవీ చలపతిరావు, తెలంగాణ విద్యుత్తు కార్మిక సంఘం అధ్యక్షుడు జాన్సన్, టీఈఈఏ ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్య, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధి మాతంగి శ్రీనివాస్, ముస్లిం మైనార్టీ అసోసియేషన్ నేత నాసర్ షరీఫ్, ఏఈల సంఘం ప్రతినిధి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.