నల్లగొండ : రానున్న కాలంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరిపేలా చర్యలు చేపడతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే అన్ని రకాల చేతి వృతిదారులకు పెద్ద పీట వేస్తున్నారని తాజాగా గౌడ్ వృత్తిదారులకు వైన్స్ షాపుల కేటాయింపులో 15శాతం రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.
ఈ నిర్ణయం గౌడకుల అభ్యున్నతికి ఎంతో తోడ్పాటు నందిస్తుందన్నారు. శుక్రవారం జిల్లా చండూర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి శ్రీనివాసగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ.. దేవతలు తాగే సురాపానకం కల్లుగా స్వీకరించిన చరిత్ర గీతకార్మికునికి ఉందన్నారు. టీఆర్ఎస్ సర్కార్ హయాంలో తెలంగాణలో 4కోట్ల ఈత చెట్లను నాటామన్నారు.
గౌడ్స్ కు వైన్స్ లలో రిజర్వేషన్ కేసీఆర్ తోనే సాధ్యం అయిందన్నారు. భువనగిరి వద్ద నందనంలో, నల్గొండలో నీరా ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.