హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య సేవల్లో రాష్ర్టాన్ని దేశంలో అగ్రభాగాన నిలిపేందుకు కృషిచేస్తామని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్డీఏ) అధ్యక్షుడు డాక్టర్ కత్తి జనార్దన్ అన్నారు. అందులోభాగంగా, కంటివెలుగు రెండోదఫాను విజయవంతం చేస్తామని చెప్పారు. ఆదివారం జనార్దన్తోపాటు అసోసియేషన్ ప్రతినిధులు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావును కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైద్యుల బదిలీలను పారదర్శకంగా చేపట్టడంతోపాటు మునుపెన్నడూ లేనివిధంగా కోరుకొన్న చోట పోస్టింగ్ ఇచ్చారని సంతోషం వ్యక్తంచేశారు. దాంతో కుటుంబానికి దగ్గరగా ఉంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా మెరుగైన వైద్యసేవలు అందించే అవకాశం కలిగిందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది సమస్యలను పరిష్కరించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.