Komati Reddy | ప్రభుత్వం వచ్చాక ప్రజాభవన్ ద్వారా ప్రజాపాలన నిర్వహిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వంద రోజుల్లోనే అన్ని పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. పండుగ సందర్భంగా పేదింటి ఆడబిడ్డలు బస్సుల్లో ఫ్రీ సౌకర్యం ద్వారా సొంత గ్రామాలకు వెళ్లారని తెలిపారు. ఆర్టీసీ బస్సులలో 30లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఘనత తమ ప్రభుత్వందేనన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ సిలిండర్లు సబ్సిడీకి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తున్నాం.. చేస్తామన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో రూ.10కోట్ల హాస్టల్ నిర్మాణం, నల్లగొండ, ముషంపల్లి, కన్నేకల్ మీదుగా తిప్పర్తి వెళ్లేలా రూ.100 కోట్ల రోడ్డు పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు.
గుండ్లపల్లి నుంచి రేగట్ట వరకు 30 కోట్లతో డబుల్ రోడ్డు పనులు ప్రారంభం, ధర్వేశిపురం వయా దోరేపల్లి, పగిడిమర్రి వరకు రోడ్డు పనులు రూ.34కోట్లతో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలను అందరూ ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ఎంక్వయిరీ వేయడం జరిగిందన్నారు. నల్లగొండలో డ్రైనేజీ, మిగిలిపోయిన రోడ్లు, ఇటీవల మున్సిపాలిటీలో విలీనం చేసిన చర్లపల్లి, మర్రిగూడెం, అర్జాల బావిలో అన్ని పనులు చేయిస్తామని వివరించారు.