ములుగు : జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసేంత వరకు ఇక కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్రం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ ప్రధాని మోదీ పర్యటనను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 7,8 తేదీల్లో జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద గిరిజన విద్యార్థులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ వంటివి ఏర్పాటుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణలోని బీజేపీ ఎంపీలు కేంద్రం నిధులు తేవడంలో విఫలమయ్యారని విమర్శించారు. గిరిజన విశ్వ విద్యాలయానికి స్థల సేకరణ జరుగలేదని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రి అబద్దాలు ఆడటం శోచనీయమన్నారు.
తాను ఎంపీగా ఉన్న సమయంలో ములుగు, మహబూబాబాద్ లో గిరిజన యూనివర్సిటీ కోసమని స్థల సేకరణ కోసం ఉన్న పూర్తి భూమి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు గుర్తు చేశారు. వర్సిటీ కోసం 336 ఎకరాల భూమిని కేటాయించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. మోదీ పర్యటనలో గిరిజన యూనివర్సిటీ , మేడారం జాతరకు జాతీయ హోదా ప్రకటించకపోతే ఆయన పర్యటనకు సార్థకత లేదన్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ప్రజలు, ప్రజా సంగాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ములుగు, వెంకటాపూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బాదం ప్రవీణ్, లింగాల రమణారెడ్డి, అశోక్, భూక్య మురళి, విద్యార్థి విభాగం నాయకులు మోతె రాజు, విష్ణువర్ధన్, భూక్య అమర్ సింగ్, ఎంపీటీసీల జిల్లాఫోరం అధ్యక్షుడు పోరిక విజయ్ రాం నాయక్, బైకాని సాగర్, కోగిల మహేశ్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.