ఆర్మూర్, ఫిబ్రవరి 21: కేంద్రంలోని మోదీ సర్కారు ఏకపక్షంగా రాజ్యమేలుతున్నదని, పలు రాష్ర్టాలపై వివక్షను కొనసాగిస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమంత్రులతో కలిసి పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కూలగొడతామని హెచ్చరించారు. సోమవారం ఆయన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో వెజిటేబుల్ మార్కెట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం నాన్వెజ్ ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టే దమ్ము ఆ పార్టీకి ఉందా ఆయన ప్రశ్నించారు. దళితబంధు దేశ ప్రజలందరికీ రావాలంటే కేసీఆర్ ప్రధానమంత్రి అయితేనే అది సాధ్యమవుతుందని ఎమ్మెల్యే జీవన్రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. అధర్మపురి అర్వింద్గా మారాడని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలుపుకోలేని యాక్సిడెంటల్ ఎంపీగా ఆయన్ను అభివర్ణించారు. అర్వింద్కు దమ్ముంటే జిల్లా అభివృద్ధికి నిధులు తెచ్చి తన పేరును నిలుపుకోవాలని డిమాండ చేశారు. అనవసరంగా కార్యకర్తలను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కులం, మతం పేరుతో కార్యకర్తల్లో చిచ్చుపెట్టొద్దని సూచించారు.