జనగామ : చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునే వాళ్లకు నిధులు అందే విధంగా చూస్తామన్నాని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండలానికి చెందిన పలువురికి డీసీసీబీ వివిధ పరిశ్రమల కోసం రుణాలను మంజూరు చేసింది. ఆయా నిధుల చెక్కులను పాలకుర్తి మంత్రి క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లబ్ధిదారులు కోరుకున్న వ్యాపారాల్లో బాగా రాణించాలని ఆకాంక్షించారు. ఇంకా కావాలంటే మరిన్ని రుణాలు అందజేస్తామన్నారు. గతంలో డీసీసీబీ అవినీతి మయంగా ఉండేదన్నారు.
డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావు, డిప్యూటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అనేక మందికి నిజాయితీగా రుణాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.