వరంగల్ : వరంగల్ నగరాన్ని సమిష్టిగా మరింత అద్భుతంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రేటర్ వరంగల్ ఏర్పడ్డ తరువాత మొట్ట మొదటి పాలకవర్గం నగర సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేసిందని అభినందించారు. కార్పొరేటర్లంతా రాజకీయాలకు అతీతంగా పనిచేసి డివిజన్లను అన్నిరంగాల్లో బాధ్యతగా అభివృద్ధి చేశారని కొనియాడారు.
ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. రానున్న వరంగల్ నగర పాలిక ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. అనంతరం కార్పొరేటర్లకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు హాజరయ్యారు.