హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : కాలుష్య నివారణకోసం ఆర్టీసీలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు షార్ట్ సర్యూట్తో కాలిపోతున్నాయని, ప్రయాణికుల రక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో డీజిల్ బస్సులే నడుపాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కే యాదయ్య, బీ యాదగిరి ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సులు రిపేర్కు పంపినపుడు వాటిల్లో విధులు నిర్వర్తిస్తున్న కండక్టర్లకు డ్యూటీలు వేయకుండా సెలవులు ఇస్తుండటంతో వారు తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారని పేర్కొన్నారు. యాజమాన్యం వెంటనే స్పందించి ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో డీజిల్ బస్సులు నడుపాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, ప్రయాణికుల కోసం కొత్త స్టాప్లను పెంచడంతో బుకింగ్లు పెరిగాయని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరుకు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు రూట్లో నడిచే పుష్పక్ సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు. ఈ నిర్ణయంతో రోజూ అదనంగా 60 నుంచి 70 టికెట్లు బుక్ అవుతున్నట్టు నాగిరెడ్డి తెలిపారు.