మహబూబాబాద్ : పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను అన్ని విధాల కాపాడుకుంటామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని కొత్తగూడ, గంగారాం మండలాల టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండలాల ముఖ్య నేతల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజలకు అందించేలా పార్టీ కార్యకర్తలు అనుసంధాన కర్తలుగా పని చేయాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఈ ప్రాంతానికి అధిక నిధులు ఇస్తున్నా. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీ వేసి, నన్ను చైర్మన్ గా చేశారన్నారు. ఈ సమస్య పరిష్కారం మన చేతుల్లో పెట్టారు.
ఈ ప్రాంతంలో పోడు రైతులకు ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని హామీనిచ్చారు. ఇక్కడి రైతులకు రెండు పంటలకు నీరు ఇస్తామన్నారు.
ఈ ప్రాంతంలో ఇప్పటికే గిరిజనులందరికీ త్రీఫేస్ కరెంట్ అందించే పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆర్అండ్ బీ ద్వారా వీలుకాని పక్షంలో గిరిజన సంక్షేమ శాఖ నుంచి రోడ్లు వేస్తామన్నారు.
పార్టీ పటిష్టంగా ఉన్నపుడే ప్రభుత్వం మన కోసం ఏ పని అయినా చేయడానికి ముందుకు వస్తుంది. కాబట్టి పార్టీ పటిష్టత కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్, పార్టీ పరిశీలకులు కుమారి బిందు, నూకల రంగా రెడ్డి, జిల్లా ఓడీసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, పార్టీ నేతలు వేణు, సమ్మన్న, గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.