జగిత్యాల, మార్చి 10: వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా రెండో శనివారం విద్యుత్తు నిర్వహణను చేపడతామని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని జగిత్యాల సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) సత్యనారాయణ తెలిపారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయమని ముందుగానే అన్ని ప్రధాన పత్రికలకు ప్రకటన జారీ చేశామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో అర్బన్, రూరల్ మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కార్యక్రమానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని, తమ విధి నిర్వహణలో భాగంగా విద్యుత్తు నిర్వహణ పనులు మొదలు పెట్టామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కార్యక్రమం అని చెప్పగానే 20 నిమిషాల వ్యవధిలో లైన్ క్లియరెన్స్(ఎల్సీ) ఇచ్చామని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో.. శాఖల మధ్య సమన్వయ లోపంతోనే విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిందని పట్టభధ్రుల ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి స్పష్టం చేశారు.