హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-సిద్దిపేట రహదారి విస్తరణ పనుల్లో రూట్ మ్యాప్ను మార్చుకోవాలని సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేస్తామని ఎయిర్ కమోడోర్ పంకజ్జైన్ తెలిపారు. హకీంపేటలోని ఎయిర్ఫోర్స్ సెంటర్లో శనివారం ‘మీడియా ఓరియంటేషన్ క్యాప్సూ ల్ కోర్సు’ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్-సిద్దిపేట హైవే విస్తరణ వల్ల హకీంపేటలో కొంత ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉన్నదని తెలిపారు. హకీంపేట నో ఫ్లయింగ్ జోన్ కాబట్టి.. రక్షణ శాఖకు చెందిన భూముల్లోంచి హైవే విస్తరణ జరుగుతున్నందున రూట్ మ్యాప్ను మార్చుకోవాల్సి రావచ్చన్నా రు. అయితే ఆ మార్గంలో ఫ్లైఓవర్లు నిర్మించే ప్రాంతంలో అండర్పాస్లను ప్రతిపాదిస్తామని వెల్లడించారు. గతంలో ఇదే విషయమై సీఎస్ శాంతికుమారితో మాట్లాడితే.. సుముఖత వ్యక్తంచేశారని తెలిపారు. తమ ప్రతిపాదనపై సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మీడియా ఓరియెంటేషన్ క్యాప్సూల్ కోర్సు’లో భాగంగా హకీంపేట, దుండిగల్, బీదర్, బేగంపేట్లకు చెందిన వైమానిక దళం శక్తి సామర్థ్యాలు, సిబ్బందికి ఇచ్చే శిక్షణ, ఫైటర్స్కు కల్పిస్తున్న ప్రత్యేక శిక్షణ, వసతులపై మీడియా ప్రతినిధులకు వివరించారు.