హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్షాల కూటమి బలపడుతుందనే భయంతో కేంద్రం జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు పార్లమెంట్ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నదని, జమిలి ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కమిటీని సీపీఐ బహిష్కరిస్తున్నదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కే నారాయణ తెలిపారు. ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చాడ వెంకట్రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీని కలిసికట్టుగా నిర్వీర్యం చేయాలని ఇతర పార్టీలను ఆయన కోరారు.
ఏపీ సీఎం జగన్ కేసుల నుంచి త ప్పించుకునేందుకే బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎంపై ఐటీ, ఈడీ దాడులు చేస్తే, కోట్లాది రూపాయలు బయటపడుతాయని, అందుకే దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీపై ఐటీ దాడులు చేయడంలేదని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అనేది తలకిందులుగా తపస్సు చేసినా వీలుపడని అంశమని అన్నారు. జమిలి ఎన్నికల విధానం అనేది దేశంలో పాత విధానమేనని, దీనిపై ప్రధాని మోదీ కమిటీని వేస్తూ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామనడం సరికాదని సూచించారు.