హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజా సంక్షేమ పథకాలను కర్ణాటకలోనూ అమలు చేయాలని పలు రైతు సంఘాల నేతలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సుమారు 30కిపైగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు సోమవారం సీఎంను కలిసి వినతిపత్రం అందించారు. అంతకుముందు బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా నిర్వహించేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల సీఎంలను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ కలిసి విజ్ఞప్తి చేశారు.
తాజాగా కార్ణాటక సీఎం బొమ్మైను కలిసి వినతిపత్రం ఇచ్చారు. త్వరలోనే కేరళ, మహారాష్ట్ర సీఎంలను కలువాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, పింఛన్లు వంటి అనేక పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. ప్రజల బాగుకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయని పేర్కొన్నారు. రైతు సంఘాల విజ్ఞప్తిపై కర్ణాటక సీఎం బొమ్మై సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు. కర్ణాటకలో తెలంగాణ పథకాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
తెలంగాణ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రత్యేక ఉద్యమాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో రైతు సంఘాలు నిర్ణయించాయి. దేశవ్యాప్తంగా 50లక్షల మంది రైతులతో ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అన్ని రాష్ర్టాల రైతులను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జాతీయ పసుపు రైతు సంఘం ఉపాధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు, కర్ణాటక రైతు సంఘాల అధ్యక్షుడు శాంతకుమార్, వినయ్రావు, వీరన్న గౌడ్, సరేష్ పాటిల్, నల్లమల వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.