కొత్తగూడ, మే 2 : ‘పార్లమెంట్ ఎన్నికల్లో మేం కాంగ్రెస్ పార్టీకి ఓటేయం. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లనే మాకు తాగనీకే నీళ్లియ్యక మస్తు తిప్పలు పెడుతున్నడు. నీళ్ల కోసం మస్తు తక్లీబ్ అయితున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ల కోసం మేం రోడ్లమీదికి, చెరువుల కాడికి రాలె. కేసీఆర్ సార్ ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి నీటి సమస్యలు లేకుండా చేసిండు.
పదేండ్లలో గింత కూడా తక్లీబ్ కాలేదు’ అని మహబూబాబాద్ జిల్లా సరసన్నపల్లి గ్రామానికి చెందిన మహిళలు తమ గోడువెళ్లబోసుకున్నారు. ‘కాంగ్రెస్ వచ్చినంక మళ్లీ నీళ్ల కష్టం వచ్చిందని గ్రామస్థులు వాపోతున్నారు. బిందెడు నీటికోసం కిలోమీటర్ల దూరం ఉన్న వ్యవసాయ బావులు, బోర్లు, చెరువులు, కుంటల కాడికి నడిచిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్య తీరిస్తే తప్ప పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయమని ముక్తకంఠంతో చెబుతున్నారు.