హైదరాబాద్: విద్యుత్ రంగంపై కాంగ్రెస్ సర్కారు మొన్న చాలా మాటలు మాట్లాడిందని, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయని చెప్పిందని, కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్రంగాన్ని నాశనం చేసిపోయిందంటూ నోటికొచ్చిన కూతలు కూసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన శ్వేతపత్రానికి కౌంటర్గా శ్వేదపత్రం పేరుతో కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన నాడు విద్యుత్ రంగం 2,700 మెగావాట్ల లోటుతో, రూ.22 వేల కోట్ల అప్పులతో ఉన్నదని చెప్పారు. అలాంటి విద్యుత్ రంగాన్ని మేం కొత్తపుంతలు తొక్కించామన్నారు.
కేటీఆర్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘మాకు అప్పజెప్పిన నాడు తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు. కానీ మేం దిగిపోయే నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 19,464 కోట్లు. అంటే వాళ్లు 60 ఏండ్లలో తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని కేవలం 7,778 మెగావాట్లకు తీసుకొస్తే.. మేం పదేళ్లలో దాన్ని మరో 12 వేల మెగావాట్లు పెంచాం. వచ్చే ఏడాది మేం నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టులు అందుబాటులోకి రానుండటంతో తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 25 వేల మెగావాట్ల కంటే పైకి చేరుకోనుంది’ అని చెప్పారు.
‘రాష్ట్రలో తలసరి విద్యుత్ వినియోగం కూడా బాగా పెరిగింది. 2013-14లో తలసరి విద్యుత్ వినియోగం 1,196 యూనిట్లుగా ఉంటె, ఇప్పుడది 2,140 యూనిట్లకు చేరుకున్నది. మేం అధికారంలోకి వచ్చిననాడు తెలంగాణలో విద్యుత్ పీక్ డిమాండ్ 5,661 మెగావాట్లుగా ఉంటె.. ఇప్పుడది 15,497 మెగావాట్లకు పెరిగింది. అప్పుడు 400 కేవీ సబ్స్టేషన్లు 6 ఉంటె.. ఇప్పుడు 25కు పెరిగినయ్, 220 కేవీ సబ్స్టేషన్లు 51 ఉంటె.. 103 అయినయ్, 132 కేవీ సబ్స్టేషన్లు 176 ఉంటె.. 250కి పెరిగినయ్, 33 కేవీ సబ్స్టేషన్లు 2,138 ఉంటె.. మేం 3,200కు పెంచినం’ అని కేటీఆర్ తెలిపారు.
‘మేం అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణలో 19 లక్షల మోటార్ కనెక్షన్లు ఉండేవి. పదేళ్లలో మరో 9 లక్షల మోటార్ కనెక్షన్లు పెరిగి 28 లక్షలకు చేరినయ్. అయితే కాలువల ద్వారా నీళ్లిస్తుంటే తెలంగాణలో మోటార్లు ఎందుకు పెరిగినయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నిస్తున్నడు. ముఖ్యమంత్రి గారిది అమాకత్వమో, అజ్ఞానమో అర్థం కావడం లేదు. భూగర్భ జలాలు పెరిగితే, 24 గంటల ఉచిత విద్యుత్ వస్తుంటే, ఒక్క బటన్ నొక్కితే నీళ్లు వస్తుంటే రైతులు మోటార్ల ద్వారా కాకపోతే ఎక్కడో ఉన్న కాలువల ద్వారా నీళ్లు తెచ్చుకుంటరా మీరే ఆలోచించాలి’ అని కేటీఆర్ అన్నారు.
‘ఒడిశాలో ద్రవపది ముర్ముగారు రాష్ట్రపతి అయ్యే వరకు ఆమె స్వగ్రామంలో కరెంటు లేదు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. మారుమూల గిరిజన గూడేలకు కూడా కరెంటు సరఫరా ఉన్నది. విద్యుత్ రంగంలో ఈ అభివృద్ధి పనులన్నీ చేయడానికి మేం పెట్టిన ఖర్చు రూ.1,37,517 కోట్లు. ఈ ఖర్చుతో మేం సృష్టించిన ఆస్తుల మార్కెట్ విలువ ఇప్పుడు రూ.6,87,585 కోట్లు. మేం రూ.6.71 లక్షల కోట్లు అప్పులు చేసినమని వాళ్లు చెప్తున్నరు. కానీ ఒక్క విద్యుత్ రంగంలోనే మేం రూ.6.78 లక్షల కోట్ల ఆస్తులను సృష్టించామని మేం గుర్తుచేస్తున్నం. వచ్చే ఏడాది 1080 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంగల భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, 4 వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్, భూపాలపల్లిలో 600 మెగావాట్ల కేటీపీపీతోపాటు, 6,106 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా అందుబాటులోకి రానున్నది. దాంతో తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 26 వేల మెగావాట్లకు చేరుకోనున్నది’ అని ఆయన వెల్లడించారు.