KTR | రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘పార్లమెంట్ ఎన్నికల్లో నూతనోత్సాహంతో పనిచేసి సత్తాచాటాలి. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన ఉండి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేలా చూడాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేవరకు, పథకాలు ప్రజలకు చేరే వరకు పోరాడాలని సూచించారు. అయ్యప్ప దయ, స్వామి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు.
స్థానిక తెలంగాణ భవన్లో మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలపై ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని స్పష్టంచేశారు. అభివృద్ధిలో సిరిసిల్లను రాష్ర్టానికే ఆదర్శంగా నిలిపానని గుర్తుచేశారు. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉన్నదని, అందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రజాపాలనలో అర్హులందరితో అన్ని పథకాలకు దరఖాస్తు చేయించాలని నాయకులకు సూచించారు. పట్టణ ప్రజలకు ఏ సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా చేసేందుకు మున్సిపల్లో తీర్మానం చేయాలని చైర్పర్సన్ జిందం కళ, కౌన్సిలర్లకు సూచించారు.
అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనకు చెప్పాలని కోరారు. స్వయంగా తానే వచ్చి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం విశ్వబ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (వోపా) నూతన క్యాలండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వోపా భవన నిర్మాణానికి సహకారం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు గూడూరి ప్రవీణ్, బొల్లి రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.