కరీంనగర్ : తెలంగాణ రాకముందు నీటి కోసం యుద్దాలు జరిగే పరిస్థితులు ఉండేవి. గతంలో ఇతర ప్రాంతాల నుంచి చేపపిల్లలను దిగుమతి చేసుకుంటే స్వరాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
సోమవారం ఎల్ఎండీ రిజర్వాయర్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిపల్లి వినోద్ కుమార్తో కలిసి చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నీలి విప్లవం తీసుకొచ్చి మత్స్యకారులకు సీఎం కెసిఆర్ అండగా నిలిచారు.
రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా అందజేయడంతో తెలంగాణలో మత్స్యకారులు ధనవంతులుగా మారారని మంత్రి పేర్కొన్నారు. ప్రతి సీజన్ లో 30 లక్షల చేపపిల్లలను కరీంనగర్ జిల్లాలో వదులుతున్నం. ఒక కోటి 50 లక్షల చేప పిల్లలను డ్యాంలో వదిలామన్నారు.
ఇప్పటి వరకు రెండు కోట్ల 80 లక్షల విలువ చేసే రెండు కోట్ల 10 లక్షల చేప పిల్లలను కరీంనగర్ జిల్లాలోని చెరువులతో పాటు ఎల్.ఎం.డి. రిజర్వాయర్లో వదిలామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జల సంపద, మత్స్య సంపద పెరిగిందని మంత్రి గుర్తు చేశారు.