Telangana | ఉద్యమాల గడ్డ జగిత్యాల బిడ్డలు వీళ్లు. ‘మా తెలంగాణ మాగ్గా వాలె’ అన్న మల్యాల వీరులు. 1969 ఉద్యమంలో కాలుదువ్విన యువకులు. ఏడు పదుల జ్ఞాపకాల పెద్దల మాటలు.. నిన్నటి, నేటి తెలంగాణను కండ్లకు కట్టే సాక్ష్యాలు. తొలి తెలంగాణ పోరాటంలో పిడికిలెత్తి కదిలారు. మలి దశ తెలంగాణ పోరాటంలో భుజం కలిపారు. ఈ జన్మలో సాకారం కాదనుకున్న తెలంగాణ చూశాం. తాము కలలుగన్న అభివృద్ధిని కండ్లారా చూస్తున్నామంటున్నారు. కేసీఆర్ పాలన పల్లె రూపులు, రైతు రాత మార్చిందని మనసులోని మాటలెన్నో చెబుతున్నారు.
మిట్టపల్లి సుదర్శన్ (సర్పంచ్, మల్యాల): తెలంగాణ ఆవిర్భావం తర్వాతనే మా ఊరు అభివృద్ధి బాట పట్టింది. ఒకప్పుడు సాగునీరు ముచ్చటనే లేదు. తాగునీళ్లు వచ్చేవి కావు. రోడ్ల మాట దేవుడెరుగు! దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ, మనకు కాదు అన్నట్టుండేది!
వడ్డేపల్లి రాజయ్య (రిటైర్డ్ టీచర్): ఊరు ముచ్చట పక్కన పెట్టు! గోదావరి నీళ్లు ఎన్నడైనా కండ్ల జూసినమా?! నీళ్లన్నీ సముద్రం పాలయ్యేది కదా. మన పొలాలేమో బీడుగా ఉండేటియి. పంటల్లేక పనులు ఉండకపోవు. భూములున్నోళ్లు కూడా దేశం బోయి బతకంగ ఎంతమందిని చూడలే!
లక్ష్మీనారాయణ (రిటైర్డ్ ఫారెస్ట్ కన్జర్వేటర్): ఎవ్వరు పట్టించుకోక… అప్పట్ల తెలంగాణ బతకనీకి దేశం బోయింది.
వడ్లకొండ భూమరాజం: బువ్వకు లేక భీవండి, బొంబాయి, దుబాయి పోయి బతికితిమి. గంత దూరం పోయినా.. గొప్పగ బతికినమా అంటే, అదీ లేదు. పొట్టకూ, బట్టకే ఎల్లేది. సదువులేదు. కొలువుల్లేవు.
లక్ష్మీనారాయణ: ఈ బాధలు భరించలేకనే కదా.. 1969ల తెలంగాణ ఉద్యమం వచ్చింది. అప్పట్ల నేను జగిత్యాలల ఇంటర్ సదువుతుంటి. ‘ప్రభుత్వం మనల్ని పట్టించుకోలే. చిన్నచూపు చూస్తుండే. ‘తెలంగాణ వొస్తనే మన బతుకులు బాగుపడతయ’ని మా సీనియర్లు చెప్పేటోళ్లు! మా క్లాస్ పోరగాళ్లమంతా వాళ్లతో కలిసి ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నం. ధర్నాలు, రాస్తారోకోలు చేసినం. జగిత్యాల పోరు జోరైందని సర్కార్ పగబట్టింది. కానీ, మన గోస వినలే! పోలీసులు లాఠీచార్జీ చేసిన్రు. అరెస్ట్ చేసిన్రు. పోరగాళ్లను ఆపుడు కష్టమని కాలేజీలే
మూసేసిన్రు.
రాజయ్య : అవును నారాయణ! 54 ఏండ్ల కిందటి ముచ్చట. అప్పట్ల ఏడెనిమిది నెలలు పోరాటం చేసినం. మన కాలేజీ పోరగాల్లం తక్కువ లడాయి చేసినమా?! పిల్లగాళ్లను తీస్కవోయి రోడ్లమీద అడ్డంగ కూసునేది. ఒక్కటే నినాదం.. ‘మా తెలంగాణ మాగ్గావాలె’ అని పోరాటం చేసినం. చెట్లు, మొద్దులు రోడ్లకు అడ్డంగా పడేసి రాస్తారోకో చేసేటోళ్లం. బజార్లల్ల కరెంటు స్తంభాలకు ఉన్న బుగ్గలు పలగ్గొట్టినం. పోలీసులు ఎన్నిసార్లు లాఠీచార్జీ చేసిన్రో! వాళ్లకు దొరక్కుండా గల్లీల పడి ఉరికేది. మల్లొచ్చి లొల్లి షురూ చేసేది.
సుదర్శన్ : తెలంగాణ అంటే అప్పుడొక క్రేజ్. నేను తొమ్మిది సదువుతాన్న. మల్యాల బడిల మాకు తోచినట్లు చేశినం. బస్సు అద్దాలు పగులగొడితే, హర్తాల్ చేస్తుండే! తొమ్మిదో తరగతి పిల్లగాన్ని అని చూడకుండా పోలీసులు నన్ను జైల్లో పెట్టిన్రు.
రాజయ్య : ఇంత పోరాటం చేస్తే ఏమైంది? ఆంధ్రోళ్ల పాలన ఆగలె. ఇగ తెలంగాణ రాదనుకున్నం. ఎట్లనో కొట్లాడి తెచ్చుకున్నం. తెలంగాణ వచ్చిన్నాడు ఎట్లుండే! రోడ్లు సక్కగ ఉండకపోతుండే! ఈ పదేండ్లలో మస్తు మారింది. ప్రతి ఊళ్ల దూరం నుంచే మిషన్ భగీరథ ట్యాంక్ కండ్లపడతున్నది. ఊరూరా హరితహారం మొక్కలు స్వాగతం పలుకుతున్నయ్. ప్రతి ఇంటి ముందు నల్లా. రాత్రయితే స్తంభాలన్నీ బుగ్గలతో వెలిగిపోతున్నయ్!
సుదర్శన్: నేను కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల్లో పని చేసిన. మూడు పార్టీల తరఫున సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన. మల్యాలకు సర్పంచ్గా చేయడం ఇది ఆరోసారి. ఒకప్పుడు మన ఊరికి నిధులు తీసుకురావాలంటే హైదరాబాద్కు వందసార్లు పోవాల్సి వచ్చేది. లక్ష రూపాయలు తేవాల్నంటే యుద్ధమే. అసొంటిది ఈ నాలుగేండ్లల మా ఊరికి పది కోట్ల రూపాయల నిధులు తెచ్చినం.
లక్ష్మీనారాయణ: సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్లె తెలంగాణ ఇంత మంచిగైంది. నేను ఊళ్లన్నీ తిరుగుతుంటా! ఊళ్లన్నీ మా ఊరి తీరుగనే బాగుపడ్డయ్. నీళ్లకు కరువు లేదు. పొలాలన్నీ పచ్చగ పండుతున్నయ్. ఫ్రీ కరెంట్తోని రైతుల బాధలు తీరినయ్. రైతుబంధుతో అన్నదాతలు బాగువడ్డరు. ముసలవ్వలు, వితంతువులు పింఛన్లతోని సంతోషంగా బతుకుతున్నది ఇప్పుడే.
సుదర్శన్ : ఈ రోజు మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి కర్త కేసీఆరే! తెలంగాణకు దశ, దిశ నిర్దేశించిన కేసీఆర్ నిజంగా దేవుడే! తెలంగాణ ఊరంటే భగీరథ నీళ్లు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, సీసీ రోడ్లు, కరెంటు లైట్లు, డంపింగ్ యార్డులు, క్రీడా ప్రాంగణాలు ఇన్ని సౌలత్లు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రిదే.
లక్ష్మీనారాయణ: తెలంగాణ వస్తే మన నిధులు మనకు దక్కుతయన్నరు. ఆ ఫలితం చూస్తున్నం. చేనేత కష్టాలు నేనూ అనుభవించిన. చిన్నప్పుడు భీవండి పోయిన. దశాబ్దాల పాటు తెలంగాణది వలస బతుకే. ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయినయ్.
సుదర్శన్ : మాతోపాటు ఓ పది మందికిపైగా కార్మికులు మా ఇంట్ల మగ్గాల మీద పని చేసేది. నేనూ భీవండి, దుబాయ్ పోయిన. ఆ బాధలు పగోనికి గూడ రావొద్దనుకుంటం. అసొంటి బాధలు పోతున్నయంటే ఎంత బాగున్నమో!
భూమరాజం : నేను బహ్రెయిన్కు పోయిన. నాలుగేండ్లు అక్కడ పని చేసిన. ఇప్పుడందరూ తిరిగొస్తున్నరు. ఇక్కడ పనికి కొదువ లేదు. ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల టౌన్లల్ల పని కోసం వస్తున్నరు. ఇట్ల మారుతదని అనుకోలే.
లక్ష్మీనారాయణ: అసలు ముచ్చట చెప్పాలా! తెలంగాణ అభివృద్ధి అంతా నీళ్లల్లనే ఉంది. తెలంగాణ ఉద్యమ నినాదమే అది. అది గట్టిగ పట్టుకున్నడు కేసీఆర్. ఇప్పుడు నీటి సమస్య పోయింది. వ్యవసాయం మారిపోయింది. మిషన్ కాకతీయ మొదలువెట్టిన కాడి నుంచి నీళ్లు లేవన్న మాటే రాలే. కరెంటు తిప్పలు పోయినయ్. రైతుబంధు వస్తంది. రైతు బాగుపడటంతో మిగతా పనుల వాళ్లు బాగున్నరు. ఒక్కమాటలో చెప్పాలంటే.. 1969లో ఏ తెలంగాణ కోసం మేం పోరాడినమో.. అంతకన్న గొప్ప తెలంగాణ ఇప్పుడు కండ్లముందున్నది.
… నాగవర్ధన్ రాయల