హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటానుంచి చుక్కనీటినీ వదులుకోమని విద్యుత్తుశాఖమంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి ఎన్ని ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, ఎన్ భాస్కర్రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే కేంద్రం ఆ రాష్ర్ట సీఎం జగన్కు లోపాయికారిగా సహకరిస్తున్నదనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయడంలో చంద్రబాబు ఒక్కఅడుగేస్తే.. వైఎస్ రాజశేఖర్రెడ్డి వంద అడుగులేసి నీటిదొంగగా మారారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తండ్రిదారిలోనే నడుస్తూ జగన్మోహన్రెడ్డి నీటి గజదొంగగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
ఆదినుంచీ అడ్డుకుంటూనే ఉన్నాం
రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్ను మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నామని జగదీశ్రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రీన్ట్రిబ్యునల్కు నివేదించామని, అపెక్స్ కమిటీ భేటీలోనూ ప్రస్తావించామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంపై గ్రీన్ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేను కూడా ఏపీ బేఖాతరు చేస్తున్నదని అన్నారు. ఒకవైపు సర్వే మాత్రమే చేస్తున్నామని కోర్టుల్లో చెపుతూ.. మరోవైపు ప్రాజెక్టును నిర్మిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తెలంగాణను ఎడారిగా మారుస్తుంటే పదవుల కోసం నోర్లుమూసుకొన్న కాంగ్రెస్ నాయకులు నేడు చిలుకపలుకులు పలుకుతున్నారని జగదీశ్రెడ్డి మండిపడ్డారు. నాటి జలదోపిడీలో భాగస్వాములైన, నేడు బీజేపీలో ఉన్న నాయకురాలికి టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై మాట్లాడే నైతికహక్కు లేదని విమర్శించారు. తెలంగాణకు జాతీయపార్టీలు మొదటినుంచీ అన్యాయం చేస్తూనే ఉన్నాయని చెప్పారు. బీజేపీ నాయకులకు తెలంగాణ సోయి లేదని.. వారికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్వరాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నం చేయాలని హితవు పలికారు. తెలంగాణ ప్రయోజనాలే టీఆర్ఎస్కు ముఖ్యమని, వాటి పరిరక్షణకోసం ఎంతదూరమైనా వెళతామని స్పష్టంచేశారు. తెలంగాణ కోసం నిలబడి కొట్లాడే దమ్మూ.. ధైర్యం.. ఆర్తి సీఎం కేసీఆర్ ఒక్కరికే ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏమి చేశారంటూ ఆరోపిస్తున్న నాయకులకు రికార్డుస్థాయిలో సాధిస్తున్న వరి దిగుబడి కన్పించకపోవడం శోచనీయమని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయకుంటే ఏడాదికి మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్తిగతనే వస్తదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రజల ప్రయోజనాల కోసం అన్నిపార్టీలు రాజకీయాలకతీతంగా ఏకతాటిపై వస్తుంటే.. తెలంగాణలో మాత్రం పార్టీల ఎజెండా కోసమే పనిచేయటం దురదృష్టకమని పేర్కొన్నారు. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపేదాకా పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఆపేస్తున్నామని ప్రకటించడంతోపాటు, అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేసి వస్తే జగన్తో చర్చలు జరుపడానికి సిద్ధమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. షర్మిల పదేపదే తెస్తామంటున్న రాజన్న రాజ్యమంటే తండ్రికి మించిన దోపిడీకి పాల్పడతామని చెప్పటమేనని ఎద్దేవాచేశారు.