హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లు-2022 నిరుపేదలపై అదనపు భారం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆ బిల్లును ఆమోదిస్తే డిస్కంల ప్రైవేటీకరణ ఖాయమని, ఈఆర్సీ వ్యవస్థపై కేంద్రం అజమాయిషీ సరైంది కాదని, క్రాస్ సబ్సిడీని ఎత్తివేస్తే సమాజంలోని అన్ని వర్గాల మీద ముఖ్యంగా నిరుపేదల మీద అదనపు భారం పడుతుందని పేర్కొంది. బిల్లులో ఇంకా అనేక అంశాలు ప్రజా వ్యతిరేకమైనవి ఉన్నందున దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ఉన్నతాధికారుల బృందం పార్లమెంటరీ కమిటీకి తేల్చి చెప్పినట్టు తెలిసింది. విద్యుత్తుపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ ముందు గురువారం రాష్ట్ర విద్యుత్తుశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్ మోహన్రెడ్డి బృందం సమావేశమైంది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టం చేసినట్టు సమాచారం. డిస్కంల పరిధిలో బహుళ లైసెన్సింగ్ విధానం ప్రైవేటీకరణకే దారి తీస్తుందని తెలిపారు. ఓపెన్ యాక్సెస్ విధానం, సంప్రదాయేతర ఇంధన వనరులు, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, ఉత్పత్తిదారులకు చెసే చెల్లింపులు, విద్యుత్తు నియంత్రణ మండలి ఏర్పాటు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను కమిటీ ముందు వెల్లడించారు. బిల్లును వ్యతిరేకిస్తూ గతంలోనే తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని సైతం కేంద్రానికి పంపినట్టు గుర్తుచేశారు. తమ ప్రభుత్వం మొదటి నుంచే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నదని పునరుద్ఘాటించారు.