హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైటెక్ మోసాలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని, ఈ సరళికి అనుగుణంగా పోలీస్శాఖ నియంత్రణ, దర్యాప్తు వ్యవస్థలను పటిష్టపరచుకుంటున్నదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. దర్యాప్తు సంస్థల సిబ్బంది నైపుణ్యాన్ని పెంచేందుకు గుజరాత్లోని గాంధీనగర్లో నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీని కేంద్రం నెలకొల్పిందని పేర్కొన్నారు. శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్ (ఏసీఎఫ్ఈ) హైదరాబాద్ చాప్టర్ మూడో వార్షిక సమావేశం నిర్వహించారు. ‘అన్ఫోల్డింగ్ ఫ్రాడ్ డెటరెన్స్’ అంశం ఇతివృత్తంగా నిర్వహించిన ఈ సమావేశానికి డీజీపీ ఎం మహేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, హైటెక్ నేరాలు, ఆర్థిక మోసాలను నియంత్రించేందుకు ఏసీఎఫ్ఈ సంస్థ ఎంతో కృషి చేస్తున్నదంటూ, హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు శరత్కుమార్ను అభినందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇంటలిజెన్స్ బ్యూరో మాజీ స్పెషల్ డీజీ అకోల్ ప్రభాకర్, ఏసీఎఫ్ఈ అంతర్జాతీయ అధ్యక్షుడు బ్రాక్యూ డోరిస్, అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అమిత్ దూబే తదితరులు పాల్గొన్నారు.