గజ్వేల్, జూలై 23: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నదని, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్టు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని కాళేశ్వరం ఎస్ఈ కార్యాలయంలో కమాండ్ కంట్రోలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్ఈలు, ఈఈలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజత్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నదులు, రిజర్వాయర్లు, ప్రధాన కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితులను తెలుసుకోవడానికి ఇరిగేషన్ శాఖ డాటా సపోర్టింగ్ సిస్టమ్ను తయారు చేసిందన్నారు. దీనిలో నదులు, ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం, ప్రవాహ వేగం తదితర అంశాలను పొందుపర్చినట్టు తెలిపారు.
భారీ వరదలు వచ్చినప్పుడే కాకుండా సామాన్య పరిస్థితుల్లోనూ నదులు, ప్రాజెక్టుల్లో ఆయా ప్రాంతాల్లో ఎంతనీటి నిల్వలు ఉన్నాయి? కాలువ కింద ఎంత నీటి అవసరం ఉన్నది? తదితర అంశాలను లెక్కగట్టి నేరుగా నీటి విడుదల చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. భారీ వర్షాలు కురుస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టులో వరద అదుపులోనే ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం మూడు కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఆదేశాలిస్తున్నట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యవేక్షణకు గజ్వేల్, కరీంనగర్లో కమాండ్ కంట్రోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఈఎన్సీ హరిరామ్, హైడ్రాలజీ సీఈ శ్రీదేవి, ఎస్ఈలు బస్వరాజ్, వేణు తదితరులు పాల్గొన్నారు.