హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడులను సమూలంగా మార్చే ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంతో స్కూళ్లు సరికొత్త సొబగులద్దుకుంటున్నాయి. అలా చేతులుపెట్టగానే.. ఇలా నీళ్లొచ్చేలా బడుల్లో బ్యాటరీ ఆపరేటెడ్ నల్లాలను బడుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఫైవ్స్టార్ హోటళ్లు, కార్పొరేట్ కంపెనీల్లో మాత్రమే కనిపించే సెన్సర్ నల్లాలను ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ఈ నల్లాల బిగింపు పూర్తికాగా, మరికొన్నింటిలో పనులు కొనసాగుతున్నాయి. మన ఊరు మన బడి కార్యక్రమంలో తొలుత రూ.30 లక్షల లోపు పనులను చేపట్టారు. అందులో భాగంగా బడులన్నింటికి నీరు.. సురక్షిత తాగునీరందించే పనులు కొసాగుతున్నాయి. ఒక్కో విద్యార్థికి 45 లీటర్ల తలసరి నీటి వినియోగం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పైకప్పులో ట్యాంక్లను ఏర్పాటు చేసి చేతులు కడుగుకోవటానికి, మరుగుదొడ్లకు నిరంతరంగా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సెన్సర్ నల్లాల ప్రత్యేకతలు
రూ. 444 కోట్ల అంచనా వ్యయం..
మన ఊరు – మన బడి తొలి విడుతలో భాగంగా 9,123 సర్కారు బడులను సమగ్రంగా మారుస్తుండగా, మేజర్ రిపేర్లు, మైనర్ రిపేర్లు, టాయిలెట్ల మరమ్మతులు, సంపుల నిర్మాణం, వాటర్ ట్యాంక్ల నిర్మాణం వంటి పనులు చేపడుతున్నారు. తొలి విడుతలో ఎంపికైన బడుల్లో 14, 114 యూనిట్లకు గాను మొత్తం పనులకు రూ. 444.64 కోట్ల బడ్జెట్ అంచనా వేశారు. బాల బాలికలకు వేర్వేరు టాయిలెట్లు, హ్యాండ్వాష్ వసతి ఉండేలా, నిరంతరం నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు.