హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి జాతీయస్థాయిలో మరో ఘనత లభించింది. స్వచ్ఛభారత్ మిషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వాటర్ప్లస్ హోదాకు హైదరాబాద్ను ఎంపికచేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖ దేశంలోని మొత్తం ఎనిమిది నగరాలకు శుక్రవారం ఈ హోదాను ప్రకటించగా, వీటిలో జనాభాపరంగా అతిపెద్ద నగరం హైదరాబాద్ కావడం విశేషం. మురుగు జలాల శుద్ధికేంద్రాలను మెరుగ్గా నిర్వహించడంతోపాటు శుద్ధిచేసిన నీటిని పునర్వినియోగానికి మళ్లించడంలో చేస్తున్న కృషికి ఈ హోదా లభించింది. శుద్ధిచేసి, పునర్వినియోగానికి వాడుతున్న నీరు అత్యధికంగా మూసీ నదికి ఇరువైపులా ఉన్న వ్యవసాయ భూములకు ఉపయోగపడుతున్నది. ఈ నీటితో వరి, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. కేంద్రం వాటర్ప్లస్ హోదాను ప్రకటించడం ఇదే మొదటిసారి.
28 శాతం జలాలు తిరిగి వినియోగం
స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఓడీఎఫ్, ఓడీఎఫ్+, ఓడీఎఫ్ ++ సర్టిఫికెట్లను అందజేస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్ ఓడీఎఫ్ ++ హోదా సాధించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు జీహెచ్ఎంసీ వాటర్ప్లస్ హోదా కోసం దరఖాస్తు చేసింది. స్వచ్ఛభారత్ కోసం జలమండలి, హెచ్ఎండీఏ సాగించిన కృషి ఫలితంగా హైదరాబాద్ వాటర్ ప్లస్ హోదాకు ఎంపికైంది. హైదరాబాద్లో జలమండలి 25 సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీలు), హెచ్ఎండీఏ మూడు ఎస్టీపీలను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా మల వ్యర్థాలను శుద్ధిచేసే ప్రక్రియ చేపడుతున్నది. నివాస, వాణిజ్య ప్రాంతాల నుంచి విడుదలయ్యే వ్యర్థజలాలలో దాదా పు 772 ఎంఎల్డీ వ్యర్థజలాలను ఈ ఎస్టీపీలలో శుద్ధి చేస్తున్నారు. శుద్ధిచేసిన జలాలను పార్కులు, రోడ్లు, నర్సరీలు, టాయిలెట్ల నిర్వహణతో పాటు వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే మురుగు జలాల శుద్ధిపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తనిఖీల్లో మంచి మార్కులు సాధించిన హైదరాబాద్ అత్యున్నత హోదాను సొంతం చేసుకున్నది. శుద్ధి చేస్తున్న నీటిలో 28 శాతం జలాలను తిరిగి ఉపయోగిస్తుండటంతో ఈ గుర్తింపు లభించిందని జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు ఆనందం వ్యక్తంచేశారు. హైదరాబాద్కు వాటర్ప్లస్ గుర్తింపు లభించడం పట్ల నగర మేయర్, డిప్యూటీ మేయర్లు గద్వాల్ విజయలక్ష్మి, శ్రీలత శోభన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.
హైదరాబాద్ ప్రజలకు అభినందనలు:
మంత్రి కేటీఆర్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద హైదరాబాద్ నగరం వాటర్ ప్లస్ హోదాను సాధించడం పట్ల ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు సంతోషం వ్యక్తంచేశారు. హైదరాబాద్ ప్రజలను అభినందిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరం ఇప్పటికే ఓడీఎఫ్ ++ సిటీగా గుర్తింపు పొందిన విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు కృషిచేస్తామని ట్విట్టర్లో పేర్కొన్నారు.