హైదరాబాద్, జనవరి7 (నమస్తే తెలంగాణ) కాచిగూడ: రాష్ట్రంలోని అన్ని బీసీ గురుకులాల్లో సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు చేయాలని వెనకబడిన వర్గాల సంక్షేమ గురుకుల సొసైటీ బోర్డు నిర్ణయించింది. శుక్రవారం ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బోర్డు మీటింగ్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ముఖ్య అంశాలపై చర్చించారు. విద్యార్థులకు వేడినీటి సదుపాయం కల్పించాలని మంత్రి ప్రతిపాదించగా బోర్డు ఆమోదించింది. వచ్చే విద్యా సంవత్సరంలో టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్, ఈ-లెర్నింగ్ తరగతులను కూడా పెంచాలని బోర్డు నిర్ణయించింది. అకడమిక్ సెల్, ఇంటర్నల్ ఆడిట్ టీమ్లను బలపర్చి, కమిటీల ద్వారా అన్ని అంశాలను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని బోర్డు తీర్మానించింది. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజేపీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు, టీఎస్ రెడ్కో చైర్మన్ జానయ్యతో పాటు బోర్డు సభ్యులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఇటీవల గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజును మంత్రి గంగుల అభినందించారు.
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని మంత్రి గంగుల కమలాకర్కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విజప్తి చేశారు. శుక్రవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. నిరుద్యోగులకు రూ.4 వేల కోట్ల బడ్జెట్ విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో అదనంగా 240 గురుకులాలు, 150 కాలేజ్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని, జూనియర్ అడ్వకేట్లకు ఇస్తున్న ఉపకారవేతాన్ని పెంచాలని కోరారు.