కృష్ణాకు స్థిరంగా వరద
శ్రీశైలం పది గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల
573 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టం
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: నీలవేణి పరవళ్లు కొనసాగుతున్నాయి. ఎగువ నుంచి స్థిరంగా వస్తున్న వరదతో ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ఆల్మట్టి మొదలు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. శనివారం సాయంత్రానికి జూరాలకు 4.78 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. శ్రీశైలానికి 5.31 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, పది గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. సాగర్కు దాదాపు 4.54 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా ఒక్కరోజులోనే 19 అడుగుల మేర పెరిగి నీటిమట్టం 573 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 264 టీఎంసీలకు చేరుకున్నది. ఆదివారం సాయంత్రం వరకు గేట్ల ను ఎత్తే అవకాశమున్నదని అధికారులు వెల్లడించారు.