Praveen | ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 29: పట్టుదల, నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ప్రవీణ్ అనే యువకుడు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రిసర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ)లో రాత్రిపూట వాచ్మన్గా పనిచేస్తున్న ప్రవీణ్ పదిరోజుల వ్యవధిలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. ఇటీవలే తెలంగాణ గురుకుల విద్యాలయాల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ డిగ్రీ వరకు జెన్నారంలో పూర్తి చేశారు. తండ్రి పెద్దులు మేస్త్రీ, తల్లి పోసమ్మ బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ ప్రవీణ్ను చదివించారు. ఎంకాం, బీఈడీ, ఎంఈడీ ఓయూ క్యాంపస్లోనే చదువుకొన్నారు. ఖర్చుల కోసం ఈఎంఆర్సీలో ఐదేండ్లుగా వాచ్మన్గా ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.