సంగారెడ్డి: సాధారణంగా పోలీసులతో మాట్లాడాలంటే పెద్దవాళ్లే భయపడుతుంటారు. వాళ్ల చేతుల్లో లాఠీలు, తుపాకీలు చూసి జంకుతుంటారు. కానీ ఓ ఆరేండ్ల బుడతడు మాత్రం పోలీసులతో ధైర్యంగా వాదనకు దిగాడు. దుర్గామాత ఊరేగింపులో డీజే ఆపించిన పోలీసులతో ఏకంగా వాగ్వాదానికే దిగాడు. ‘మీటింగ్ తర్వాత పెట్టుకుందాం.. ముందైతే డీజేకు అనుమంతించండి..’ అంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశాడు. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలో ఇటీవల దుర్గామాత ఊరేగింపు నిర్వహించారు. రాత్రి 10 గంటలు దాటినా డీజే పెట్టుకుని ఊరేగింపు నిర్వహిస్తుండటంతో పోలీసులు అక్కడికి చేరుకుని డీజేను నిలిపివేయించారు. ఈ పరిణామంతో ఆ ఊరేగింపులో ఉన్న ఆరేండ్ల బుడతడికి చిర్రెత్తుకొచ్చింది. డీజేను ఎందుకు ఆపారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ‘మేం పండుగలు కూడా చేసుకోవద్దా..?’ అని నిలదీశాడు.
అంతేగాక ‘మనం దీనిపై తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మీటింగ్లు అవసరంలేదు. ముందైతే మాకు డీజే ఆన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వండి..’ అని పెద్ద ఆరిందలా చెప్పాడు. ఏం చదువుతున్నావు అని పోలీసులు అడిగితే థర్డ్ క్లాస్ అని ధైర్యంగా సమాధానమిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కింది వీడియోలో బుడతడి వాగ్వాదాన్ని మీరూ ఒకసారి వీక్షించండి.