హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు ఏటేటా పెరుగుతున్నాయి. దీంతో గోదాముల సామర్థ్యన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు కొత్త గోదాములను నిర్మించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి తెలంగాణలో అన్ని రకాల గోదాముల మొత్తం నిల్వ సామర్థ్యం 39 లక్షల టన్నులు మాత్రమే. గత ఏడేండ్లలో ఇది దాదాపు రెట్టింపు అయింది. ప్రస్తుతం 72 లక్షల టన్నులకు పెరిగింది. ముఖ్యంగా మార్కెటింగ్ శాఖ తన గోదాముల సామర్థ్యాన్ని 7.38 లక్షల టన్నుల నుంచి 24.73 లక్షల టన్నులకు పెంచుకొన్నది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ (ఎస్డబ్ల్యూసీ) గోదాముల సామర్థ్యం 2.61 లక్షల టన్నుల నుంచి 7.24 లక్షల టన్నులకు, ఇన్వెస్టర్స్ గోదాముల సామర్థ్యం 16.93 లక్షల టన్నుల నుంచి 26.34 లక్షల టన్నులకు పెరిగింది.
కోటి టన్నుల దిశగా..
రాష్ట్రంలో ఏటికేడు సాగు విస్తీర్ణం, పంట దిగుబడులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదాముల నిల్వ సామర్థ్యాన్ని పెంచడం అనివార్యమైంది. దీంతో ఇప్పటికే 72 లక్షల టన్నులకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం దీన్ని కోటి టన్నులకు చేర్చే దిశగా చర్యలు చేపడుతున్నది. దీనిలో భాగంగా మార్కెటింగ్ శాఖ ఇప్పటికే 40 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసింది. ఈ గోదాముల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో మొత్తం నిల్వ సామర్థ్యం 1.12 కోట్ల టన్నులకు పెరుగుతుంది.
గోదాముల్లో సంస్కరణలు
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఓవైపు గోదాముల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతూనే.. మరోవైపు సంస్కరణలను అమలు చేస్తున్నది. గోదాముల్లో నిల్వచేసిన పంట ఉత్పత్తులు పాడవకుండా నిరోధించేందుకు, నిల్వ నష్టాన్ని (స్టోరేజీ లాస్) తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే అన్ని గోదాముల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పింది. ఎస్డబ్ల్యూసీ పరిధిలోని గోదాములను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వేర్హౌజింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యూడీఆర్ఏ) పరిధిలోకి చేర్చింది. దీంతో ఆ సంస్థ గోదాముల్లోని నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేసి ప్రత్యేక గ్రేడింగ్లను జారీచేస్తుంది. వీటి ఆధారంగా గోదాముల్లో పంట ఉత్పత్తుల నిల్వకు డిమాండ్ పెరుగుతుంది. గతంలో ఉన్న గోదాముల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో స్టోరేజీ లాస్ ఎక్కువగా ఉండేది. దీన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో అన్ని గోదాముల్లో వృథా గణనీయంగా తగ్గింది.
సామర్థ్యం పెంపునకు చర్యలు..
ఎస్డబ్ల్యూసీ పరిధిలోని గోదాముల సామర్థ్యాన్ని రెట్టింపు చేశాం. మార్కెటింగ్ శాఖ కూడా మరో 40 లక్షల టన్నులకు డీపీఆర్ సిద్ధం చేసింది. ఇది పూర్తయితే రాష్ట్రంలో పంట ఉత్పత్తుల నిల్వకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గోదాముల సామర్థ్యం పెంపుతోపాటు నాణ్యతాపరమైన చర్యలు కూడా చేపట్టాం. స్టోరేజీ లాస్ లేకుండా చర్యలు చేపట్టాం.
– జితేందర్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీ