కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గ్రేటర్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో భవిష్యత్ రోజులపై ఆరోగ్యశాఖ దృష్టిసారించింది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ.. తీవ్రత నామమాత్రంగానే ఉంది. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఒక వైపు కరోనా టీకా.. మరో వైపు పెద్దసంఖ్యలో వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాన్ని అమలు చేయడంలో భాగంగా రోగులకు అవసరమైన చికిత్స అందించడంతో పాటు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు క్వారంటైన్ సెంటర్లను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈనెల 3న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ నగరంలోని ఐదు దవాఖానలను పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానలుగా సేవలందించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ దవాఖానల్లో కరోనా చికిత్సతో పాటు క్వారంటైన్ సదుపాయం కూడా ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, ఎర్రగడ్డ ఛాతి దవాఖానలను పూర్తిస్థాయి కరోనా చికిత్స కేంద్రాలుగా మార్చనున్నారు. పాతబస్తీ చార్మినార్ వద్దగల నిజామియా యూనాని దవాఖాన, బల్కంపేటలోని ప్రకృతి చికిత్సాలయం, సనత్నగర్లోని ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానల్లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే గాంధీ, కింగ్కోఠి, టిమ్స్ దవాఖానల్లో ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన ఐసోలేషన్ వార్డులు అందుబాటులో ఉన్నాయి. గాంధీలో ప్రస్తుతం 300 పడకలు, కింగ్కోఠి దవాఖానలో 200 పడకలు, టిమ్స్లో 1200కు పైగా కొవిడ్ వార్డులు అందుబాటులో ఉన్నాయి. పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం సేవలందిస్తున్న హాస్పిటల్స్తో పాటు ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ సౌకర్యంతో కొవిడ్ పడకలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్సిజన్ పడకలతో పాటు ఐసీయూ వార్డులను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.