హైదరాబాద్ : గల్ఫ్ దేశాల్లో వీసా నిబంధనలు కఠినంగా ఉంటాయి. వాటిని ఉల్లంఘిస్తే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే ఎంతో మంది వలస కార్మికులకు విజిటింగ్ వీసాలపై వెళ్లి ఇబ్బందులపాలవుతున్న విషయం విధితమే. తాజాగా.. వీసా సమస్య కారణంగా సౌదీ అరేబియాలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన పసికందు ఎట్టకేలకు.. ఏడాదిన్నర తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చింది. ఇందుకు చిన్నారి తల్లిదండ్రులు పడరాని పాట్లు పడ్డారు.
వివరాల్లోకి వెళితే.. హన్మకొండకు చెందిన మామిడాల రమ్యకృష్ణ గత ఐదేళ్లుగా సౌదీ అరేబియా తూర్పు ప్రావిన్స్లోని ఓ ఆసుపత్రిలో పని చేస్తున్నది. ఆమె సెప్టెంబర్ 30, 2019న వరంగల్లో సమంత అనే చిన్నారికి జన్మనిచ్చింది. ఆ తర్వాత రమ్యకృష్ణ తన కూతురుతో కలిసి సౌదీ అరేబియాకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందుకు ఆమె కూతురు కోసం విజిటింగ్ వీసా తీసుకొని నెల తర్వాత వెళ్లింది. ఆ తర్వాత వీసా గడువు ముగియడంతో.. మళ్లీ పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్నది.
అయితే, ఎలక్ట్రానిక్ విధానంలో పొడించారు. అయితే, వీసా గడువు ముగిసిపోయిందని.. అధికారిక రికార్డుల్లో కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన సమంత తల్లి వీసా పొడిగింపును తెలిపే మొబైల్ స్ర్కీన్షాట్లతో సహా పలు ఆధారాలను చూపుతూ సంబంధిత అధికారులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే కరోనా లాక్డౌన్ మధ్య విమాన సర్వీసులు నిలిపివేయబడ్డప్పటికీ.. హస్సా, దమ్మామ్, రియాద్లో రమ్యకృష్ణ అధికారుల చుట్టూ తిరిగింది.
గడువు ముగిసినా వీసా పునరుద్ధరించలేదంటూ తల్లీ బిడ్డలకు చెరో 15వేల రియాల్స్ చొప్పున మొత్తం 30వేల రియాల్స్ జరిమానా విధించారు. 30వేల సౌదీ రియాల్స్ భారత కరెన్సీలో దాదాపు రూ.6లక్షలు. ఓ వైపు బిడ్డను చూసుకుంటూ.. ఆసుపత్రిలో సేవలందిస్తూనే రమ్యకృష్ణ సమస్య పరిష్కారం కోసం ఉన్న ఏ అవకాశాన్ని వదలకుండా తిరిగింది.
ఈ క్రమంలో ఆమె సౌదీలో ఉన్న ప్లీస్ ఇండియా, ఎన్ఆర్ఐ గ్రూప్ అధ్యక్షుడు లతీఫ్ థెచీని కలిసి గోడును వెల్లబోసుకున్నది. స్పందించిన ఆయన రియాద్లోని ఓ న్యాయవాది దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఆయన అధికారులతో మాట్లాడి, జరిమానా నుంచి మినహాయింపు ఇచ్చేలా ఒప్పించడంతో ఎట్టకేలకు రమ్యకృష్ణ తన భర్త, కూతురుతో కలిసి బుధవారం హైదరాబాద్కు చేరింది.