న్యూఢిల్లీ: అసోం మంత్రి, బీజేపీ నాయకుడు హిమంత బిశ్వశర్మపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) 48 గంటల నిషేధం విధించింది. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ చైర్పర్సన్ హంగ్రామా మొహిలరీకి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఈసీ ఈ నిషేధం విధించింది.
హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలు, ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏప్రిల్ రెండో తేదీ (శుక్రవారం) నుంచి 48 గంటల పాటు బహిరంగ సభలు, ప్రదర్శనలు, రోడ్షోలు నిర్వహించడం, ఎలక్ట్రానిక్/ ప్రింట్/ సోషల్ మీడియాతో వ్యాఖ్యలు గానీ, ఇంటర్వ్యూల్లో గానీ పాల్గొనరాదు అని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.
బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ చైర్పర్సన్ హంగ్రామా మొహిలరీని బహిరంగంగా బెదిరించారని, కేంద్ర దర్యాప్తు సంస్థను అడ్డం పెట్టుకుని జైలుకు పంపుతామని హిమంత బిశ్వ శర్మ హెచ్చరికలు జారీ చేశారని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీనిపై శుక్రవారం లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
ఒకవేళ హంగ్రామా వేర్పాటువాద చర్యలకు పాల్పడితే జైలుకెళ్తాడు.. బాథాను ప్రోత్సహిస్తే జైలుకెళ్తారు.. దీనిపై బోలెడంతా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇది నేరుగా జరిగిన చర్చ.. ఈ అంశాన్ని ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశిస్తాం అంటూ హంగ్రామాను నేరుగా హిమంత బిశ్వ శర్మ బెదిరించారని ఆయనకు ఇచ్చిన నోటీసులో ఈసీ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి