వరంగల్ బీజేపీ కార్పొరేటర్, పార్టీ కీలక నేత టీఆర్ఎస్లో చేరిక
గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): బీజేపీకి మరో గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా శని, ఆదివారాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగడానికి ముందే బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్లో చేశారు. శుక్రవారం వరంగల్కు చెందిన కీలక నేతలు గులాబీ కండువా కప్పుకొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో వరంగల్ నగర పాలక సంస్థ బీజేపీ కార్పొరేటర్ చింతాకుల అనిల్, పార్టీ మాజీ అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునీల్ టీఆర్ఎస్లో చేరారు.
బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో మంత్రి కేటీఆర్ పార్టీలో చేరిన నేతలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్ కీలక నేత, రెండు సార్లు రైల్వే బోర్డు సభ్యుడిగా వ్యవహరించిన చింతాకుల సునీల్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయటం కోసం బీజేపీతో తనకున్న 30 ఏండ్ల అనుబంధాన్ని వీడానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఏనుమాముల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీ రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.